కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ – కామారెడ్డి ప్రధాన రహదారిలో పూర్తిగా చెడిపోయిన బావుపేట రోడ్డు (Bavupeta Road) మరమ్మతుల కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన ఎంపీ నిధుల నుండి రూ.16 లక్షలు కేటాయించినందుకు బిజెపి కొత్తపల్లి మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు అధ్యక్షులు కుంట తిరుపతి చెప్పారు.
బావుపేట వద్ద రోడ్డు మరమ్మతుల కోసం రూ.16 లక్షల ఎంపీ నిధులు కేటాయించడం పట్ల కొత్తపల్లి బిజెపి శాఖ హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం రోజున కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కుంట తిరుపతి మాట్లాడుతూ రోడ్డు మరమ్మతుల కోసం నిధులు ఇచ్చింది కేంద్రమంత్రి బండి సంజయ్ అయితే.. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రెడిట్ కోసం పాకులాడుతున్నారని ఘాటుగా విమర్శించారు.
బావుపేట రోడ్డు నిర్మాణానికి కేంద్రమంత్రి బండి సంజయ్ నిధులు మంజూరు చేస్తే, ఆ ఘనతంతా తమదేనంటూ బిఆర్ఎస్ నేతలు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రచారం చేసుకోవడానికి సిగ్గుండాలన్నారు. సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన బిఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల చేయలేదని, నేడు సోషల్ మీడియా వేదిక గా రోడ్డు మరమతు విషయంలో బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసుకోవడం పట్ల ఆయన మండిపడ్డారు.
కరీంనగర్ కామారెడ్డి ప్రధాన రహదారులో ప్రజల ప్రయాణ ఇబ్బందులను తొలగించేందుకు తక్షణ స్పందించి రూ.16 లక్షలు కేటాయించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్కు కొత్తపల్లి మండల ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

