కలం, వెబ్ డెస్క్: ఖతార్ (Qatar) నుంచి బయలుదేరాల్సిన విమానాలు రద్దు కావడంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ పర్యాటకులు, సందర్శకుల కోసం దోహా (Doha)లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 7 మధ్య విమానాలు రద్దు కావడం వల్ల ఖతార్లోనే ఉండిపోయిన భారతీయ పౌరులు, టూరిస్ట్ వీసా లేదా ఇతర వీసాపై వచ్చి చిక్కుకుపోయిన వారు తమ వివరాలు అందించాలని సూచించింది. ఇది కేవలం సందర్శకుల కోసం మాత్రమేనని, ఖతార్లో నివసిస్తున్న భారతీయులకు వర్తించదని పేర్కొంది.
ఖతార్లో ఎంతమంది భారతీయ పర్యాటకులు చిక్కుకుపోయారు, వారి వివరాలు ఏమిటనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడం కోసమే ఎంబసీ ఈ సమాచారాన్ని సేకరిస్తోంది. దీని ద్వారా తదుపరి సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఓ గూగుల్ ఫామ్ లింక్ను ఎంబసీ పోస్ట్ చేసింది. బాధిత భారతీయులు సదరు లింక్లో తమ వివరాలను వెంటనే నమోదు చేసుకోవాలని కోరింది.

