అమెరికా ఆయుధాలపై ట్రంప్ కీలక నిర్ణయం

క‌లం, వెబ్ డెస్క్‌: అమెరికా అత్యాధునిక ఆయుధాల సంఖ్యను భారీగా పెంచేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నడుం బిగించారు. దేశంలోని టాప్ రక్షణ రంగ కంపెనీల సీఈఓలతో సమావేశమైన ట్రంప్, యుద్ధ విమానాలు, క్షిపణులు వంటి అత్యున్నత శ్రేణి ఆయుధాల ఉత్పత్తిని ఏకంగా నాలుగు రెట్లు పెంచాలని ఆదేశించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.

ప్రపంచ ప్రఖ్యాత రక్షణ సంస్థలైన బోయింగ్ (Boeing), లాక్‌హీడ్ మార్టిన్ (Lockheed Martin), రేథియాన్ (Raytheon), నార్త్‌రోప్ గ్రుమ్మన్ వంటి కంపెనీల అధినేతలతో ట్రంప్ చర్చలు జరిపారు. ఆయుధాల తయారీ వేగాన్ని పెంచేందుకు వారు అంగీకరించారని ఆయన తెలిపారు. అత్యాధునిక సాంకేతికత కలిగిన ఆయుధాలను అత్యధిక సంఖ్యలో, అతి తక్కువ సమయంలో అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆయుధాల తయారీకి సంబంధించిన ప్లాంట్ల ఏర్పాటు పనులు మూడు నెలల క్రితమే మొదలయ్యాయని, ప్రస్తుతం ఉత్పత్తి ప్రక్రియ వేగంగా సాగుతోందని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా వద్ద మీడియం గ్రేడ్ ఆయుధాలు భారీగా ఉన్నాయని, అయినా కూడా వాటి ఆర్డర్లను కూడా పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు.

కొత్తగా ఏర్పాటు చేయబోయే ఆయుధ తయారీ ప్లాంట్ల‌ కోసం అమెరికాలోని ప‌లు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని, తమ రాష్ట్రంలో ఈ కంపెనీలు ఏర్పాటు చేయాలంటూ బిడ్డింగ్ వేస్తున్నాయని ట్రంప్ వెల్లడించారు. ఇది దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కూడా సృష్టించనుంది. వచ్చే రెండు నెలల్లో ఈ కంపెనీల ప్రతినిధులతో మరోసారి సమావేశం కానున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్, వెనిజువెలా వంటి దేశాల విషయంలో అమెరికా వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>