కలం, వెబ్ డెస్క్ : అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ లక్ష్యంగా సాగిస్తున్న దాడులు అత్యంత క్రూరంగా ఉన్నాయని, ఇది కేవలం సైనిక స్థావరాల మీద జరుగుతున్న దాడి కాదని ఐక్యరాజ్యసమితి (UN)లో ఇరాన్ (Iran) శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇరవానీ పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై ఆయన మాట్లాడుతూ, పౌర నివాస ప్రాంతాలే లక్ష్యంగా 2,000 పౌండ్ల భారీ బాంబులను ప్రయోగిస్తూ అమాయక ప్రజలను ఊచకోత కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ నగరాలపై విచక్షణారహితంగా దాడులు చేస్తూ గరిష్ట స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించడమే వారి ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యం చేసుకున్నామన్న అమెరికా, ఇజ్రాయెల్ వాదనలు పచ్చి అబద్ధాలని ఆయన అన్నారు.
ఈ దాడుల కారణంగా ఇప్పటివరకు కనీసం 1,332 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, వారిలో మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నట్లు ఇరవానీ పేర్కొన్నారు. ముఖ్యంగా 180 మందికి పైగా ఇరాన్ (Iran) పిల్లలు ఈ యుద్ధానికి బలి కావడం అత్యంత విషాదకరమని ఆయన అన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, మసీదులు, దౌత్య కార్యాలయాల వంటి పౌర మౌలిక సదుపాయాలను ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేస్తున్నారని ఆయన వివరించారు. 20కి పైగా పాఠశాలలు, 13 ఆరోగ్య కేంద్రాలు ఈ దాడుల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయని గణాంకాలతో సహా వివరించారు. ఈ దారుణాలను అరికట్టాలని భద్రతా మండలిని పదేపదే కోరుతున్నా, మండలి మౌనం వహించడం శోచనీయమని ఆయన అన్నారు.

