కలం, వెబ్డెస్క్: అమెరికాతో వాణిజ్య (India US Trade) ఒప్పందంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్తో ట్రేడ్ డీల్కు సంబంధించి మంగళవారం అమెరికా విడుదల చేసిన ఫ్యాక్ట్షీట్లో స్పల్ప మార్పులు జరిగాయి. ఇందులో నుంచి కొన్ని రకాల పప్పులకు యూఎస్ మినహాయింపు ఇచ్చింది. అలాగే 500 బిలియన్ డాలర్ల అమెరికన్ వస్తువులను భారత్ దిగుమతి చేసుకోవాలనే అంశంలోనూ కొన్ని సవరణలు చేసింది.
భారత్, యూఎస్ ట్రేడ్ డీల్లోని ముఖ్యాంశాలతో ఫ్యాక్ట్ షీట్ను మంగళవారం వైట్ హౌస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏముందంటే ‘అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని రకాల ఇండస్ట్రియల్ గూడ్స్, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ సుంకం తొలగిస్తుంది. లేదా క్రమంగా తగ్గించుకుంటూ పోతుంది. ఇందులో డ్రిల్డ్ డిస్టిల్టర్స్ గ్రెయిన్స్(డీడీజీఎస్), ఎర్ర జొన్నలు, ట్రీ నట్స్(బాదం, పిస్తా, జీడి వంటివి), పండ్లు, సర్టెన్ పల్సెస్, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్, అదనపు ప్రొడక్ట్స్ ఉన్నాయి’ అని పేర్కొంది.
అయితే, సవరించిన ఫ్యాక్ట్షీట్లో ‘సర్టెన్ పల్సెస్’ అనే పదాన్ని తీసేసింది. వాస్తవానికి ఈ విభాగంలోకి వచ్చే పప్పులు, శనగలు, చిక్కుడు, డ్రై బీన్స్ వంటివి భారత్లో విస్తారంగా పండుతాయి. అందువల్ల ఇండియాలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. అమెరికా నుంచి పప్పుధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి అనుమతి ఇవ్వడంతోపాటు సుంకం లేకుండా చేయడం భారత రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పార్లమెంట్లోనూ, బయట ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఈ క్రమంలో డీల్కు సంబంధించి కొన్ని సవరణలతో అమెరికా విడుదల చేసిన రెండో ఫ్యాక్ట్ షీట్లో పల్సెస్ను మినహాయించడం గమనార్హం.
వ్యవసాయ ఉత్పత్తులూ..
అలాగే మొదటి ఫ్యాక్ట్ షీట్లో 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ఉత్పత్తులు కొనడానికి భారత్ అంగీకరించింది అని ఉంది. ఇందులో ఇంధనం, ఐటీ ప్రొడక్ట్స్, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, తదితరం ఉన్నాయి. దీనిలోనూ వైట్హౌస్ సవరణలు చేసింది. 500 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి ‘అంగీకరించింది’ అనే స్థానంలో ‘భావిస్తోంది’ అని మార్చింది. అలాగే, వ్యవసాయ ఉత్పత్తులను తీసేసింది. ఈ మార్పులను బట్టి కొన్ని రకాల పప్పులు, వ్యవసాయ ఉత్పత్తులు భారత్కు దిగుమతి కావని తెలుస్తోంది. అయితే, మిగిలిన వాటిలో మాత్రం యూఎస్ మార్పులు చేయలేదు.
కాగా, భారత్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. ఇప్పుడు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటే భారత రైతుల ఉత్పత్తులకు మార్కెట్ తగ్గుతుది. వ్యవసాయం కుదేలవుతుంది. అందువల్ల ఈ ట్రేడ్ (India US Trade) డీల్పై భారత రైతుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సవరించిన ఫ్యాక్ట్షీట్లో పప్పులు, వ్యవసాయ ఉత్పత్తులను తీసేయడం కొంత ఊరటనిచ్చేదే. అయితే, ట్రేడ్ డీల్ అమల్లోకి వచ్చేంతవరకు అమెరికాను ముఖ్యంగా ట్రంప్ను నమ్మలేం అని విశ్లేషకులు అంటున్నారు.
Read Also: డాక్టర్ శ్రీలీల.. ఎంబీబీఎస్ పట్టా అందుకున్న నటి
Follow Us On: Sharechat


