కలం, వెబ్ డెస్క్: దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాల వ్యాప్తి నెమ్మదించినట్లు ఐఎండీ పేర్కొంది. దీంతో సుమారు 28 శాతం లోటు వర్షపాతం (Rainfall) నమోదైనట్లు వివరించింది. రుతుపవనాల గమనం స్తంభించిపోవడంతో అనేక రాష్ట్రాల్లో తీవ్ర వర్షపాత లోటు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వివరించింది. ఇప్పటికే, మెజార్టీ జలాశయాల్లో నీట మట్టాలు దిగువకు చేరాయని.. తాగునీటికీ ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినట్లు అనేక ప్రైవేట్ వాతావరణ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఈసారి వర్షాకాలంలో దేశ వ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని ఇప్పటికే ఐఎండీ రిపోర్ట్ ఇచ్చింది. బలమైన ఎల్ నినో పరిస్థితులే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం..
తెలుగు రాష్ట్రాలపై ఎల్ నినో ప్రభావం గట్టిగానే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో అయితే కేవలం ఏడెనిమిది జిల్లాలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కానుంది. మిగతా అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు కానుంది. ఇప్పటికే భూగర్భ జలాలు కూడా పడిపోవడంతో ఈసారి వ్యవసాయ రంగానికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలో ఆరు తడి పంటల వైపు మొగ్గు చూపాలని తెలంగాణ ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది.

