కలం, మెదక్ బ్యూరో: గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా మెదక్ మండలంలోని రాయిన్పల్లి ప్రాజెక్టు హైలెవల్ కాల్వ, లోలెవల్ కట్ట కొట్టుకుపోయింది. దెబ్బతిన్న ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి (Padma Devender Reddy) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ మేరకు బీఆర్ఎస్ (BRS) నేతలు, రైతులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మెదక్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాయిన్పల్లి ప్రాజెక్టు ద్వారా సుమారు 2,500 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందన్నారు. నీళ్లు మళ్లించే కట్ట దెబ్బతిని ఏడాది గడిచినా ప్రభుత్వం ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తక్షణమే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాయిన్పల్లి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే వేలాది మంది రైతులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

