కలం, స్పోర్ట్స్: భారత జూనియర్ మహిళల హాకీ జట్టు (Women Hockey Team) వచ్చే నెల యునైటెడ్ కింగ్డమ్ పర్యటనకు (UK Tour) సిద్ధమవుతోంది. జూలై 5 నుంచి 14 వరకు జరిగే ఈ పర్యటనలో మొత్తం ఏడు మ్యాచ్లు ఆడనుంది. కొత్త ప్రధాన కోచ్ టిమ్ వైట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టుకు ఇది తొలి ప్రధాన అంతర్జాతీయ పర్యటన కానుంది. భవిష్యత్ టోర్నీలకు సన్నాహకంగా ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్ తన పర్యటనను స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో ప్రారంభిస్తుంది. జూలై 5, 6 తేదీల్లో స్కాట్లాండ్ సీనియర్ మహిళల జట్టుతో రెండు మ్యాచ్లు ఆడుతుంది.
అనంతరం ఇంగ్లండ్లోని లిల్లీషాల్కు వెళ్లి మరో ఐదు మ్యాచ్లు ఆడనుంది. జూలై 8, 11 తేదీల్లో అమెరికా అండర్-21 జట్టుతో, జూలై 9, 12 తేదీల్లో ఇంగ్లండ్ అండర్-21 జట్టుతో భారత్ తలపడుతుంది. జూలై 14న బెల్జియం అండర్-21 జట్టుతో జరిగే మ్యాచ్తో పర్యటన ముగుస్తుంది. ఈ పర్యటన యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో అనుభవాన్ని అందిస్తుందని కోచ్ టిమ్ వైట్ తెలిపారు. వివిధ దేశాల ఆట శైలులను దగ్గరగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు ఆటగాళ్లు అలవాటు పడేందుకు, ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు, తమ ఆటను మరింత మెరుగుపరుచుకునేందుకు ఇటువంటి పర్యటనలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన వివరించారు. జట్టు బలాలు, మెరుగుపరచాల్సిన అంశాలను గుర్తించడానికి కూడా ఈ మ్యాచ్లు సహాయపడతాయని చెప్పారు. అలాగే భవిష్యత్లో సీనియర్ జట్టులోకి (Women Hockey Team) వెళ్లే ఆటగాళ్లకు అవసరమైన అనుభవాన్ని ఈ పర్యటన అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: వరల్డ్కప్లో నార్వే బోణీ.. హాలాండ్ అదరగొట్టాడు!
Follow Us On: Instagram

