కలం, ఖమ్మం బ్యూరో: అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) విమర్శించారు. నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న వేణు అనే యువకుడిని ఆదివారం ఖమ్మంలోని ఆసుపత్రిలో పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, బీఆర్ఎస్ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
యువత ధైర్యం కోల్పోవద్దు..
ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. యువత ధైర్యం కోల్పోవద్దని, తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి, వారి న్యాయమైన హక్కుల సాధనకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటాలు కొనసాగిస్తామని పువ్వాడ స్పష్టం చేశారు.

