epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

హిందువులపై దాడుల ఎఫెక్ట్​.. బంగ్లాదేశ్​కు సాయంలో కోత

కలం, వెబ్​డెస్క్​: బంగ్లాదేశ్​లో భారత వ్యతిరేక అల్లర్లు, హిందువులపై దాడుల ప్రభావం ఆ దేశానికి అందించే సాయంపై పడింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ (Nirmala Sitharaman) ఆదివారం కేంద్ర వార్షిక బడ్జెట్​ 2026–27 (Union Budget 2026) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్​లో ‘ఎయిడ్​ టు కంట్రీస్​’ కింద పొరుగు దేశాలకు ఏటా భారత ప్రభుత్వం కొంత మొత్తం సాయం కింద ఇస్తుంది. ఇందులో ఈ ఏడాది బంగ్లాదేశ్​కు రూ.60కోట్లను కేంద్రం ప్రకటించింది. గతేడాది రూ.120 కోట్లను కేటాయించగా, ఈసారి ఏకంగా సగానికి కోత పెట్టింది.

బంగ్లాదేశ్​లో విద్యార్థుల ఆందోళనల కారణంగా పదవి కోల్పోయిన ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్​లో తలదాచుకుంటోంది. ఈ క్రమంలో ఏడాదిన్నరగా బంగ్లా​లో భారత వ్యతిరేక ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. హిందువులపై దాడులకు పాల్పడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. మహ్మద్​ యూనస్​ నేతృత్వంలోని బంగ్లా​ తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను, హత్యలను పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో భారత్​కు దూరమవుతూ, పాకిస్థాన్​కు దగ్గరవుతున్న బంగ్లాదేశ్​కు సాయంలో కోత విధించినట్లు భావిస్తున్నారు.

మరోవైపు ఈ ఏడాది బడ్జెట్ (Union Budget 2026)​ లో ‘ఎయిడ్​ టు కంట్రీస్​’కు కేటాయింపులు 4 శాతం పెరిగాయి. నిరుడు రూ.5,483 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.5,686కోట్లు ప్రకటించారు. ఇందులో భూటాన్​ అన్నింటికంటే ఎక్కువగా రూ.2,289కోట్లు దక్కించుకుంది. ఇది గతేడాది కేటాయింపుతో పోలిస్తే 6శాతం అధికం. ఇక, నేపాల్​కు రూ.880కోట్లు, శ్రీలంకకు రూ.60కోట్లు, మయన్మార్​కు రూ.300కోట్లు, మాల్దీవులు, మారిషస్​లకు చెరో రూ.550కోట్లు, ఆఫ్ఘనిస్థాన్​కు రూ.150కోట్లు, మంగోలియాకు రూ.50కోట్లు, షీషెల్స్​కు రూ.19కోట్లు, ఆఫ్రికన్​ దేశాలకు రూ.225కోట్లు బడ్జెట్​లో కేటాయించారు.

చాబహార్ పోర్ట్​కు కేటాయింపులు లేవు!

కాగా, ఇరాన్​లోని చాబహార్​ పోర్టు (Chabahar Port) కు ఈసారి బడ్జెట్​లో భారత్​ నిధులు కేటాయించకపోవడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ పోర్టును భవిష్యత్​ అవసరాల దృష్ట్యా అభివృద్ధి చేసేందుకు భారత్​.. ఇరాన్​తో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నేళ్లుగా నిధులు కేటాయింపు, పనులు జరుగుతున్నాయి. అయితే, ఈసారి బడ్జెట్​లో చాబహార్​కు నిధుల కేటాయింపు లేదు. అమెరికా, ఇరాన్ (Iran)​ మధ్య ఉద్రికత్తలు.. యుద్ధ ప్రమాదం ముంచుకొస్తుండడంతో భారత్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: స్కూళ్లోనే రీల్స్ చేయడం నేర్పిస్తారా.. బడ్జెట్ లో ‘ఆరెంజ్ ఎకానమీ’ ఏంటి..?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>