కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్రం నుంచి అధికారిక అజెండా వెలువడటంతో, దీనిని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి (INDIA alliance) సిద్ధమవుతోంది. ఈ కీలక అంశంపై చర్చించేందుకు నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతలు సమావేశం కానున్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం, రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఇండియా కూటమి (INDIA alliance) సమావేశంలో పాల్గొనడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల విభజన విషయంలో ‘హైబ్రిడ్ మోడల్’ను తెరపైకి తెస్తున్న సీఎం రేవంత్, దీనికి జాతీయ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించే అవకాశం ఉంది. కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లుపై కాంగ్రెస్ అధిష్టానంతో కలిసి ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేయడం ఈ పర్యటనలో అత్యంత కీలకం కానుంది.

