కలం, వెబ్ డెస్క్: దేశంలో మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు ‘నారీ శక్తి వందన్’ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ అంశాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రధాన అంశంగా తీసుకుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women Reservation Bill)పై బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్లు ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమై చర్చించనున్నారు. బిల్లుకు మద్దతుగా చేపట్టాల్సిన కార్యక్రమాలను చర్చించటంతో పాటు మూడు పార్టీల అధినేతలూ కలసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు తనవంతుగా బిల్లుకు మద్దతు కోరుతూ లేఖ రాశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ చారిత్రాత్మక చట్టానికి పార్లమెంట్లో బలమైన మద్దతు కల్పించాలనే లక్ష్యంతో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లను రాజధానికి వెళ్లాలని ఆదేశించారు.
కాగా, ఇదివరకే ఈ బిల్లు మద్దతుపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాజ్య సభ, లోక్ సభ ఎంపీలకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) లేఖ రాశారు. 2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు చేసేలా తీసుకువస్తున్న ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని లేఖలో కోరారు. మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు ప్రవేశపెట్టే ఈ నెల 16వ తేదీ భారత ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని చెప్పారు.

