కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం (Aswapuram) మండలంలో కొంత మంది అక్రమార్కులు సుమారు 70 ఇటుక బట్టీలు నిర్వహిస్తూ సహజ సంపదను కొల్లగొడుతున్నారని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడం వలన వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని అశ్వాపురం (Aswapuram) సమీప గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అలాగే వాతావరణ కాలుష్యం కూడా జరగడం వలన తుమ్మల చెరువు, సీతారాంపురం, గొల్లగూడెం గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేయాలంటే మైనింగ్, రెవెన్యూ, నీటి పారుదల, పంచాయతీ రాజ్, అటవీ శాఖ, విద్యుత్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇటుక బట్టీల నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండా డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బాధితులు చెబుతున్నారు. నివాస ప్రాంతాలకు సమీపంలో ఇటుకబట్టీలు ఉండటం వలన బూడిద గాలితో కలిసి పోయి ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరో పక్క ఇటుక బట్టీలలో పని చేయడానికి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి ఆదివాసీలను తీసుకొని వచ్చి వారి శ్రమను దోచుకోవడమే కాకుండా వారి పిల్లలతో కూడా పని చేయించుకుంటున్నారని తుడుండెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లెం కోటి ఆరోపిస్తున్నారు. అలాగే ఇటుక బట్టీలు కాల్చడం కోసం టన్నుల కొద్ది కలపను అక్రమంగా తరలిస్తున్నారన్నారు. కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి అడవులను సంరక్షించాలంటూ ఆదివాసీ సంఘాలు సోమవారం ఫారెస్ట్ డివిజనల్ అధికారికి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమతుల్లేని ఇటుక బట్టీలు సీజ్ చేసి ప్రకృతిని పరిరక్షించాలని కోరారు.

