కలం, వెబ్ డెస్క్ : ములుగు జిల్లాలో పర్యాటకులను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుండం జలపాతం (Gundam Waterfalls)లో మునిగి హైదరాబాద్కు చెందిన అక్తరుద్దీన్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి స్నేహితులతో కలిసి ములుగు జిల్లాలోని గుండం జలపాతాన్ని (Gundam Waterfalls) సందర్శించడానికి అక్తరుద్దీన్ వచ్చాడు. ఈ క్రమంలో జలపాతంలో దిగిన అతను, నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. ప్రమాదవశాత్తు లోతు ఎక్కువ ఉన్న ప్రాంతంలోకి వెళ్లడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన అతని స్నేహితులు, స్థానిక గ్రామస్థులు వెంటనే స్పందించి అక్తరుద్దీన్ను నీటి నుంచి బయటకు తీసుకువచ్చారు. ప్రాణాలు కాపాడేందుకు అతనికి సిపిఆర్ (CPR) చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కేవలం పది రోజుల వ్యవధిలోనే ములుగు జిల్లాలోని జలపాతాల వద్ద ఇద్దరు పర్యాటకులు మరణించడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జలపాతాల వద్ద అవసరమైన రక్షణ చర్యలు, హెచ్చరికా బోర్డులు ఏర్పాటు చేయడంలో అటవీశాఖ పూర్తిగా విఫలమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, గైడ్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: అమ్మాయిల్లో పెరుగుతున్న స్మోకింగ్ హ్యాబిట్.. హెల్త్కి రిస్క్!
Follow Us On: Instagram

