కలం, వెబ్ డెస్క్ : పైకి చూస్తే నిగనిగలాడే పసుపు రంగులో.. చూడగానే నోరూరించేలా కనిపిస్తున్న ఆ మామిడి పండ్ల వెనుక పెను ప్రమాదం పొంచి ఉంది. పైన పండులా కనిపిస్తున్నా, లోపల మాత్రం అవి పచ్చి కాయలే. కేవలం రసాయనాల మాయాజాలంతో మామిడి కాయలను విషపూరితం చేస్తున్న ఒక ముఠా ఆగడాలను పోలీసులు ఎట్టకేలకు అడ్డుకున్నారు. నగరంలోని గోషామహల్ కేంద్రంగా సాగుతున్న ఈ భారీ కల్తీ దందాను పోలీసులు ఛేదించారు.
మామిడి కాయలు సహజంగా పండటానికి సమయం పడుతుంది. అయితే అధిక లాభాల కోసం వ్యాపారులు అడ్డదారి తొక్కారు. ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన ఎథిలిన్ సాచెట్లను మామిడి కాయల మధ్యలో ఉంచి, వాటిని తొందరగా పండేలా చేస్తున్నారు. ఈ రసాయనాల ప్రభావంతో కాయలు (Chemically ripened mangoes) కేవలం గంటల వ్యవధిలోనే పసుపు పచ్చని రంగులోకి మారిపోయి, చూడగానే పండిన పండ్లలా భ్రమింపజేస్తున్నాయి.
బయట నుంచి చూస్తే ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ పండ్లను కట్ చేసి తింటే కానీ అసలు విషయం బయటపడటం లేదు. పైన రంగు మారినా లోపల మాత్రం అవి పచ్చిగానే ఉంటున్నాయి. అంతేకాకుండా, కాయలు త్వరగా పాడవకుండా ఉండేందుకు మరిన్ని రసాయనాలను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి విషపూరిత మామిడి పండ్లను తినడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు మామిడి పండ్లు కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అతిగా మెరిసిపోయే పండ్ల విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

