కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమాత్రం మారడం లేదు. నో పార్కింగ్ జోన్లలో వరుస కడుతున్న భారీ వాహనాలు ప్రయాణికులకు శాపంగా మారాయి. వేగంగా వెళ్లే మార్గంలో హఠాత్తుగా నిలిపి ఉంచిన లారీలను గమనించక వాహనదారులు వాటిని ఢీకొంటున్నారు. ఫలితంగా ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగులుతోంది.
అధికారులు అక్రమ పార్కింగ్ ను నియంత్రించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీలు లేకపోవడం, భారీ జరిమానాలు విధించకపోవడంతో వాహనాలను ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు. కొందరు డ్రైవర్లు కనీస బాధ్యత లేకుండా రోడ్డు పక్కనే మూత్ర విసర్జన కోసం వాహనాలను నిలిపివేస్తున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదాల్లో ఎక్కువ శాతం ఇటువంటి అక్రమ పార్కింగ్ వల్లే సంభవించడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగం నిద్ర మేల్కొనాలి. నిబంధనలను కఠినంగా అమలు చేసి అక్రమంగా వాహనాలను నిలిపే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రయాణికులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఓఆర్ఆర్ (ORR) ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
Read Also: చిన్నారుల కోసం రంగంలోకి వాయుసేన.. అసలేమైందంటే?
Follow Us On: WhatsApp

