కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో బలగం సినిమా సీన్ రిపీట్ అయ్యింది. పురానా పూల్ స్మశాన వాటికలో ఓ కుటుంబం మృతి చెందిన తమ ఇంట్లో వ్యక్తికి పిండ ప్రదానం చేసింది. కాకి ముట్టాలని గంటల తరబడి ఎదురుచూసినా ఒక్క కాకి కూడా రాలేదు. సాధారణంగా చనిపోయిన వ్యక్తులు కోపంగా ఉంటే, బాధలో ఉంటే పక్షులు పిండం ముట్టవని పెద్దలు చెప్తుంటారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గంటల తరబడి ఎదురుచూశారు. కాకుల కోసం చూసీ చూసీ విసిగిపోయి ముర్గీ చౌక్ నుంచి ఒక కాకిని కొనుగోలు చేసి, దాన్ని తీసుకొచ్చి పిండం ముట్టించారు. వాస్తవానికి కాకి మాత్రమే కాకుండా ఏ పక్షి వచ్చి పిండం ముట్టినా మంచిదేనని భావిస్తారు. కానీ, ఇక్కడ ఒక్క పక్షి కూడా రాకపోవడం గమనార్హం. నగరంలో పెరుగుతున్న కాలుష్యం, ఎండల తీవ్రత కారణంగా పక్షుల సంఖ్య భారీగా తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. పక్షులు రానంత మాత్రాన ఆచారాన్ని పక్కనపెట్టలేం కదా అంటూ ఆ కుటుంబం కాకిని కొనుక్కొచ్చి మరీ పిండం తినిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక పిండం పెట్టినప్పుడు పక్షులు రాకపోతే ఇదే పద్ధతి కొనసాగించాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

