కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై యెమెన్ కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు (Houthi Rebels) మండిపడుతున్నారు. ప్రపంచ శాంతి దెబ్బతీనేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం అనైతిక చర్య అని అంటున్నారు. తమను లక్ష్యంగా చేసుకుని అమెరికా తరుచుగా డ్రోన్ దాడులు జరుపుతుందని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని ట్రంప్ ను హౌతీలు హెచ్చరించారు. లేదంటే అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన బాబ్ అల్ మాండెబ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
జలసంధి మూసివేతతో ప్రపంచ దేశాలకు ముప్పు
సుమారు 30 కిలోమీటర్ల వెడల్పు ఉండే బాబ్ అల్ మాండెబ్ జలసంధి ద్వారా ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 12 శాతం వాటా ఈ మార్గం గుండానే జరుగుతుంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇరాన్ ఇప్పటికే హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవేళ హౌతీలు (Houthi Rebels) కూడా బాబ్ అల్ మాండెబ్ మార్గాన్ని మూసివేస్తే మూసివేస్తే పరిస్థితి దారుణంగా మారుతుంది. ఆసియా, ఐరోపా దేశాల మధ్య సరకు రవాణా నిలిచిపోతుంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలే కాకుండా ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: తెలంగాణపై తేజస్వీ వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి క్షమాపణలు!
Follow Us On: Instagram

