కలం, వెబ్డెస్క్: తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya) పార్లమెంట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. తెలంగాణ ఏర్పాటును భారత్ , పాక్ విభజనతో పోల్చుతూ తేజస్వీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఖండించారు. తేజస్వీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అతడి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తేజస్వీ వ్యాఖ్యలపై మరో బీజేపీ ఎంపీ స్పందించారు. తమ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తప్పేనని అంగీకరిస్తూ కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే (Shobha Karandlaje) తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల తేజస్వీ మాట్లాడిన తీరు సరికాదని, అందుకు చింతిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
అయితే స్వయంగా ఓ కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పినప్పటికీ తేజస్వీ మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు. తాను అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదని, తన మాటలను కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ప్రజలే తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, తెలంగాణ విభజన భారత్, పాక్ విభజనలా జరిగిందన్నది వాస్తవమని, అవే వ్యాఖ్యలను మీడియా ముందు రిపీట్ చేశారు. దీంతో వివాదం మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది.

