కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) పరిసరాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేడు బీజేపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు, బడ్జెట్పై బీజేపీ ఆందోళన నిర్వహించనుంది. మూసీ పునరుద్ధరణ డీపీఆర్ తప్పుల తడక అని, కార్పొరేట్ కంపెనీల కోసమే దీన్ని ముందుకు తీసుకొచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది. హిల్ట్ భూముల వివాదం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో స్పష్టత లేదని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక మూడు కార్పొరేషన్ల వ్యవహారంపై ఇప్పటికీ బీజేపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది.
వీటన్నింటితో పాటు హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కొరత, స్థానిక సమస్యలపై అసెంబ్లీ వేదికగా ఆందోళన చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో భారీ ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. బీజేపీ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అసెంబ్లీ , గన్ పార్క్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

