కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం కమిషన్ నివేదిక (Kaleshwaram Commission Report)పై తీర్పును హైకోర్ట్ వాయిదా వేసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్ట్లో సవాల్ చేశారు. ఈ ప్రాజెక్ట్పై పీసీ ఘోష్ నివేదికను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ కమిషన్ వేశారని ఆరోపించారు. దీనిపై నేడు హైకోర్ట్ విచారణ చేపట్టి ఏప్రిల్ 22కి తీర్పును వాయిదా వేసింది. తీర్పు పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడమే వాయిదాకు కారణంగా తెలుస్తోంది.
కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్ రావులతో పాటు ఐఏఎస్ స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ ఎస్కే జోషిలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గత కొన్ని నెలలుగా విడతల వారీగా వాదనలు జరిగాయి. ఇటీవల మార్చి 12న కేసుకు సంబంధించిన వాదనలు పూర్తి కాగా, నేడు తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఈ కమిషన్ నివేదికకు సంబంధించి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించారని, 8బీ, 8సీ నోటీసులు ఇవ్వలేదని, ఎక్కడా కూడా మిగతా ఆధారాలతో క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదని కేసీఆర్ (KCR) తరఫు అడ్వొకేట్ గతంలో వాదనలు వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే కమిషన్ వేశామని చెప్తోంది. కమిషన్ నియామకమే పూర్తిగా చట్ట విరుద్ధమని కేసీఆర్, హరీశ్ రావు అంటున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్ట్ ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read Also: తెలంగాణ టూరిజం.. సమ్మర్ లో చుట్టేద్దాం
Follow Us On: Instagram

