కలం, వెబ్ డెస్క్ : ఆప్ఘనిస్తాన్ (Afghanistan)లోని పలు ప్రాంతాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు సంభవించాయి. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. వరదల కారణంగా ఇప్పటి వరకు 100 మంది మరణించగా, 154 మందికి పైగా గాయాలు అయినట్లు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తాలిబన్ అధికారులు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. భారీ వర్షాలతో 1000కి పైగా ఇంటి పైకప్పులు ధ్వసం అయ్యాయి. 4200 పైగా ఇండ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
దీంతో పాటు పంటలు తీవ్రంగా ధ్వంసానికి గురయ్యాయి. అలాగే, నిత్యావసర సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావంతో వేల కుటుంబాలు అవస్థలు ఎదుర్కొంటున్నాయని.. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ఆప్ఘనిస్తాన్ (Afghanistan) విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. కాగా, రాబోయే రోజుల్లో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీని కారణంగా ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడడం, భవనాలు కూలిపోయే ప్రమాదం పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

