కలం, వెబ్ డెస్క్: నేటి ఆధునిక జీవనశైలిలో ఉద్యోగస్తులు గంటల తరబడి కుర్చీల్లో కూర్చొని పని (Sitting for Long Hours) చేస్తున్నారు. రోజులో కనీసం 8 నుంచి 9 గంటల పాటు వారు కూర్చొనే గడుపుతున్నారు. అయితే ఇలా నిరంతరాయంగా కూర్చోవడం వల్ల ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం పడుతుందో మీకు తెలుసా? అలా చాలా సేపు కూర్చోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువ సేపు కూర్చోవడం వలన ధూమపానం తాగినంత హాని కలుగుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. వైద్య రంగంలో ‘సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్’ అనే పదాన్ని విస్తృతంగా వాడుతున్నారు. అయితే రోజంతా గంటల తరబడి ఒకే దగ్గర కూర్చొని పని చేయడం వలన మన శరీరానికి జరిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.
శరీరానికి జరిగే ప్రధాన నష్టాలు:
ఎక్కువ సేపు కూర్చోవడం వలన వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల నడుము నొప్పి, మెడ నొప్పితో పాటు భుజాలు వంగిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వెన్నెముక భంగిమ కూడా క్షీణిస్తుంది.
రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సేపు కూర్చునే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనలు తెలిపాయి. కూర్చున్నప్పుడు రక్తప్రసరణ మందగిస్తుంది. దీనివల్ల రక్తనాళాల్లో కొవ్వు చేరడానికి కారణమై, గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది.
ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మనం కూర్చున్నప్పుడు కండరాల కదలికలు తగ్గిపోతాయి. దీని వలన మనం తిన్న ఆహారం కొవ్వుగా మారి పొట్ట చుట్టూ చేరి స్థూలకాయం సమస్య తలెత్తుతుంది.
ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మనం ఎక్కువసేపు కదలకుండా ఉండటం వల్ల శరీరం ఇన్సులిన్ హార్మోన్ ను సరిగ్గా ఉపయోగించుకోదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ వస్తుందని చెబుతున్నారు నిపుణులు.
గంటల తరబడి కూర్చోవడం వలన మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. శారీరక కదలికలు లేకపోవడం వలన మెదడుకు అందే ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన పెరిగి డిప్రెషన్ కు దారితీస్తుంది.
ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు. మరి రోజంతా కూర్చొని పనిచేసేవారి పరిస్థితి ఏమిటి అని? అలాంటి వారు కుర్చీలో కూర్చుని కూడా సాధారణ వ్యాయామాలు చేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఉదాహరణకు..
కుర్చీలో కూర్చుని చేయగలిగే సులువైన వ్యాయామాలు
- ప్రతి అరగంటకు ఒకసారి సీటులో నుంచి లేచి కొన్ని నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి.
- కుర్చీలోనే కూర్చుని కాళ్లను నిటారుగా చాచడం, చీలమండలను పైకి లేపడం, మణికట్టును గుండ్రంగా తిప్పడం వంటి సాధారణ వ్యాయామాలు చేయవచ్చు.
- నడుమును నెమ్మదిగా అటూ ఇటూ తిప్పడం, కుర్చీలో కూర్చుని మెలి తిప్పడం వలన వీపుకు విశ్రాంతిని దొరుకుంది.
- మెడ వ్యాయామం: కుర్చీలో కూర్చున్నప్పుడు మెడ బిగువును తగ్గించుకోవడానికి.. మెడను నెమ్మదిగా ఎడమకు, కుడికి, పైకి, కిందికి కదపడం.
ఇటువంటి సాధారణ వ్యాయామాలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

