కలం, వెబ్ డెస్క్: ఇంగ్లండ్తో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే చారిత్రక లార్డ్స్ టెస్ట్ (Lords Test)కు ముందు భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే టీ20 ప్రపంచకప్ నిరాశను దాటుకుని జట్టులో కొత్త ఆత్మవిశ్వాసం వస్తుందని ఆమె తెలిపారు. లార్డ్స్లో ఇదే తొలి మహిళల టెస్టు కావడం ప్రత్యేకతగా నిలిచింది. పురుషుల తొలి టెస్టు జరిగిన 142 ఏళ్ల తర్వాత ఈ చారిత్రక మ్యాచ్ జరగడం మరో విశేషం.
టీ20 ప్రపంచకప్లో ఆశించిన ఫలితం రాకపోవడంతో జట్టులో నిరాశ నెలకొందని హర్మన్ప్రీత్ చెప్పారు. అయితే ఈ టెస్ట్ విజయంతో ఆ పరిస్థితి మారుతుందని, రాబోయే టోర్నీలకు కూడా ఇది మంచి ఊపు ఇస్తుందని పేర్కొన్నారు. ఆటగాళ్లంతా ఒకరికొకరు అండగా నిలిస్తే ఈ మ్యాచ్ను చిరస్మరణీయంగా మార్చవచ్చని అన్నారు. లార్డ్స్లో టెస్ట్ ఆడటం ప్రతి క్రికెటర్ కల అని, ఈ అవకాశం రావడం పట్ల మొత్తం జట్టు ఉత్సాహంగా ఉందని తెలిపారు.
ఇక్కడ ఇప్పటివరకు మహిళల టెస్టు జరగలేదని తెలుసుకుని తాను కూడా ఆశ్చర్యపోయానని చెప్పారు. రెడ్బాల్ క్రికెట్కు అలవాటు తక్కువే అయినా, ఇటీవల నెట్ సెషన్లలో జట్టు మంచి సన్నాహాలు చేసిందని వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని మహిళల టెస్టులు జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ నిర్ణయం ఐసీసీ, సంబంధిత బోర్డుల చేతుల్లోనే ఉంటుందని చెప్పారు.
ఇటీవల టెస్టుల్లో భారత్ మంచి ప్రదర్శన చేయడం, ఇంగ్లండ్పై కూడా మంచి రికార్డు ఉండటం తమకు నమ్మకాన్ని ఇస్తోందన్నారు. ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతి స్పిన్నర్ శ్రీ చరణిపై కూడా పూర్తి విశ్వాసం ఉందని, కీలక సమయంలో ఆమె జట్టుకు విజయాలు అందించే బౌలర్గా నిలిచిందని హర్మన్ప్రీత్ పేర్కొన్నారు.

