కలం, మెదక్ బ్యూరో: సర్ ప్రక్రియను విజయవంతం చేయడానికి ఏపీ ప్రభుత్వం కలెక్టర్లు, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెంచుతూ చాలా సీరియస్ గా పనిచేస్తోందని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్ ప్రక్రియపై ముస్లిం మైనారిటీ మత పెద్దలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ఓట్లు తొలగించేలా బీజేపీ కుట్ర..
ముస్లిం మైనారిటీల ఓట్లను తొలగించాలని బీజేపీ కుట్ర పన్నుతోందని హరీశ్ రావు మండిపడ్డారు. బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని వివరించారు. తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి రానివ్వబోమన్నారు. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసిందన్నారు.
పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలు సర్ ప్రక్రియలో ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారని హరీశ్ రావు తెలిపారు. సర్పై ఆందోళన చెందల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ ముందుగా దరఖాస్తు భర్తీ చేసి బూత్ లెవల్ అధికారులకు ఇవ్వాలని సూచించారు.

