కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో స్కాములే తప్పా.. స్కీములు లేవని బీఆర్ఎస్ మాజీమంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సివిల్ సప్లై, సింగరేణి, కరెంటు, భూములు, చివరకి గురుకులాల్లో పిల్లలకు అన్నం పెట్టే ఉప్పు, పప్పు, కోడిగుడ్లలో కూడా స్కామే అని ఆయన ఆరోపించారు. మానకొండూరు నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని హరీశ్ రావు మాట్లాడారు. గురుకులాల్లో రూ. 2000 కోట్ల కుంభకోణం జరగడం వాస్తవమని.. సొంత శాఖల టెండర్లపై మంత్రులకు కనీస అవగాహన లేదని విమర్శించారు.
మూడు విడతల్లో రైతుబంధు ఎగ్గొట్టి, అన్నదాతలకు బాకీపడ్డ రూ. 19,000 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ, పెన్షన్లు, స్కీములన్నీ ఎగ్గొట్టిన ముఖ్యమంత్రిని ఇకపై ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలవాలని పిలుపునిచ్చారు. రైతు డిస్కమ్ పేరుతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్కు ఉరితాడు బిగించే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ పైసా ఇవ్వకుండా 30 లక్షల మంది పేద విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపి, వారి జీవితాలను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలకు పైసలు లేవంటున్న సీఎం.. వందల కోట్లతో క్యాంప్ ఆఫీసులు కడుతూ.. ఫుట్ బాల్ షోకులు చేస్తున్నారని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 16 వేలే ఇచ్చి, ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజులు డబుల్ చేసి నిరుద్యోగుల నడ్డి విరుస్తున్నారన్నారు. రిజిస్ట్రేషన్లు, బస్సు టికెట్లు, ఆర్టీఏ ఛార్జీలు ఇష్టారీతిన పెంచి ప్రజల రక్తం తాగుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన బలగం ఉందన్నారు.

