కలం, మెదక్ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వం వివిధ వర్గాల కోసం ఎన్నో మంచి పనులు చేసిందని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీమంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. చివరికి కృతజ్ఞత ఓడిపోయి.. ఆశ గెలిచిందన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ (మం) శంకరాయకుంటలో పర్యటించిన హరీశ్ రావు మట్లాడారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఆశ చూపి ప్రభుత్వంలోకి వచ్చాక పనులు చేయడం లేదని విమర్శించారు.
గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసం ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోందన్నారు. పంట కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల్లో చేప పిల్లలు వదలకుండా గంగపుత్రులకు, ముదిరాజులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.

