కలం, వెబ్ డెస్క్ : పరిగి (Parigi) పర్యటనకు వెళ్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ను పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. హరీశ్ రావుతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులను శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించడంతో అక్కడికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే తాజాగా హరీశ్ రావును శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు విడుదల చేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలు బయటకు వచ్చారు. దీంతో శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత సద్దుమణిగింది.
అనంతరం హరీశ్ రావు (Harish Rao) మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ”రేవంత్ రెడ్డి మళ్లీ గెలవరు.. ప్రతిపక్ష హోదా కూడా రాదు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారు. రేవంత్ రెడ్డి పాలన.. గడీల పాలన.. బేడీల పాలన. రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే అరెస్ట్ చేశారు. సాగుకు పనికిరాని భూముల్లో పరిశ్రమలు పెట్టాలి. సాగు చేసుకుంటున్న భూములు ఎలా లాక్కుంటారు. పరిగి భూములు కాజేయాలని చూస్తున్నారు. మళ్లీ రామరాజ్యం వస్తుంది.. కేసీఆర్ రాజ్యం వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు.
కాగా, వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో కాళాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో పారిశ్రామిక పార్క్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 1,197 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. అయితే సదరు ఇండస్ట్రీయల్ పార్క్ కు తమ భూములు ఇచ్చేది లేదని స్థానిక రైతులు రిలే దీక్షలు చేపట్టగా.. పరిగి రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న హరీశ్ రావుతో సహా బీఆర్ఎస్ ముఖ్య నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. వారిని మార్గమధ్యంలోనే అడ్డుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read Also: కేరళం ఎన్నికలు.. విజయన్కు కవిత మద్దతు
Follow Us On: Instagram

