కలం, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు (Harish Rao) సుదీర్ఘంగా ప్రస్తావించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ప్రవేశ పెట్టిందని.. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను రద్దు చేసిందని గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మోడల్ స్కూళ్లను కొనసాగిస్తామని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ మోడల్ స్కూల్ టీచర్ల కోసం జీవో నంబర్ 58, జీవో నంబర్ 60 ఇచ్చిందని అన్నారు. వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీంలో లేరు అని చెప్పారు. ఒకవేళ మోడల్ స్కూల్ టీచర్లు చనిపోతే సీపీఎస్ కింద గ్రాట్యుటీ ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హరీష్ (Harish Rao) వివరించారు. ఇప్పటివరకు 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోయారని.. వారికీ గ్రాట్యుటీ అందించాలని కోరుతున్నామన్నారు.
మోడల్ స్కూల్ టీచర్లు చనిపోతే వాళ్ళ పిల్లలకు కంపాషననెట్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మోడల్ స్కూల్ ఉద్యోగులకు కంపాషననెట్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని కోరారు. అలాగే మోడల్ స్కూల్ టీచర్లకు 17వ తేదీ వచ్చినా జీతాలు అందని పరిస్థితి ఉందని, కావున వారికీ జీతాలు అందించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు చేస్తామన్నారని.. మోడల్ స్కూల్ ఉద్యోగులకు కూడా హెల్త్ స్కీమ్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

