కలం, వెబ్ డెస్క్: ఒక దిశానిర్దేశం లేకుండా తూతూమంత్రంగా అసెంబ్లీ సమావేశాలు ముగిశాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా హాల్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. శాసనసభ సమావేశాలు ఒక దిశా నిర్దేశం లేకుండా ముగిశాయన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలపై (Six Guarantees) స్పష్టత వస్తుందని, ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ప్రజలకు ప్రభుత్వం తీవ్ర నిరాశనే మిగిలించిందన్నారు.
బడ్జెట్, బిల్లులు పాస్ చేసుకోవడానికి, రాజ్యాంగ అనివార్యతను పూర్తి చేయడానికి మాత్రమే తూతూమంత్రంగా సభను నడిపారని ఫైర్ అయ్యారు. నిజమైన ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం కనీసం ముందుకు రాలేదని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న 19 సమస్యలపై షార్ట్ డిస్కషన్ కోసం బీఆర్ఎస్ పక్షాన నోటీసులు ఇచ్చినా, ఏ ఒక్క అంశం పైనా ప్రభుత్వం చర్చకు రాలేదని చెప్పారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కూడా లేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు.
సభా సాంప్రదాయాలను పూర్తిగా తిలోదకాలిచ్చారని హరీశ్ (Harish Rao) ఫైర్ అయ్యారు. నియమ నిబంధనలు, సభా మర్యాదలను, ప్రతిపక్షాల పట్ల కనీస గౌరవాన్ని తుంగలో తొక్కారని ఆగ్రహించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రజా సమస్యల మీద సూటిగా సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తొండల భాష, కండల భాష వాడారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రవర్తించిన తీరు సభానాయకుడి హోదాకు తగినది కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నించడమే ప్రతిపక్ష బాధ్యత అని.. ఆ బాధ్యతను బీఆర్ఎస్ నిర్వహిస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని చెప్పారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజైనా, అప్రాప్రియేషన్ రోజైనా ప్రశ్నోత్తరాల సమయం ఉంటుందని.. కానీ ఈ ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా ఎత్తివేసిందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం రోజు, ఆర్థిక మంత్రి బడ్జెట్ పెట్టిన రోజు ప్రశ్నోత్తరాలు లేవని విమర్శించారు. సభ జరిగిన రోజుల్లో సగం రోజులు ప్రశ్నోత్తరాలు నడపలేదన్నారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారని విమర్శించారు.
Read Also: కరీంనగర్లో మైనింగ్ స్కామ్.. ట్యాక్స్ ఎగ్గొట్టి దోచేస్తున్న కంపెనీలు
Follow Us On : WhatsApp

