కలం, వెబ్ డెస్క్ : రైతులను మళ్లీ చీకట్లోకి నెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ రైతు డిస్కమ్ ఏర్పాటుకు లైసెన్స్ మంజూరు కోసం దాఖలు చేసిన దరఖాస్తుపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్ర రాజకీయ పక్షాలతో అభిప్రాయ సేకరణను చేపట్టింది. ఈ సందర్భంగా ‘రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు 3 గంటల కరెంట్ చాలు’ అని ERC ముందు కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి (Kodanda Reddy) చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
కోదండ రెడ్డి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయన్నారు. ఇది కోదండ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదని.. రేవంత్ రెడ్డి మనసులోని ఆలోచన అని హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. పొలం అంటే ఏంటో.. బోరు ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో.. రైతుల కష్టం గురించి తెలియని వాళ్లే 3 గంటల కరెంట్ చాలని మాట్లాడగలరని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టిందని గుర్తు చేశారు.
కానీ, కాంగ్రెస్ మాత్రం తెలంగాణ రైతును చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయిందన్నారు. పంట కొనుగోళ్లు చేయక రైతుల ప్రాణం తీస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి చాలదన్నట్లు మాజీ సీఎం కేసీఆర్ ఎంతో శ్రమించి అమలు చేసిన 24 గంటల కరెంట్ ను ఖతం పట్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రైతు డిస్కం ఏర్పాటు వెనుక ఉన్న అసలు కుట్ర ఇదేనా? అని ప్రశ్నించారు.
Read Also: మహిళల ఆర్థిక స్వావలంబనకు చారిత్రాత్మక నిర్ణయాలు : మంత్రి సీతక్క
Follow Us On : WhatsApp

