కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బండి భగీరథ్పై ఫిర్యాదు వచ్చి నాలుగు రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయడం అంటేనే కేసును నీరుగార్చడమని హరీశ్ రావు ఆరోపించారు. మా పార్టీ నాయకులు క్రిశాంక్, నల్లబాలు కేవలం రీట్వీట్ చేసినందుకే వారిని ఇళ్ల నుంచి పోలీసులు ఎత్తుకుపోయారని గుర్తుచేశారు. పోక్సో కేసులో తీవ్ర ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఎందుకు వదిలేశారని నిలదీశారు.
ఇప్పటివరకు ప్రభుత్వం వేసిన 10 సిట్ల రిపోర్టులు ఏమయ్యాయో ముందు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కావాలనే బండి సంజయ్ కుమారుడిని కాపాడేందుకు లీకులు ఇస్తున్నాడని మండిపడ్డారు. అసలు విషయం చర్చించుకోకుండా ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు.

