కలం, వరంగల్ బ్యూరో : ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు తీసుకొని నగరంలో సమగ్ర శానిటేషన్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని హనుమకొండ (Hanumakonda) జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ (Chahat Bajpai) అధికారులను ఆదేశించారు. “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం బల్దియా పరిధిలోని 1, 66వ డివిజన్లలోని హసన్పర్తి ప్రాంతంలో ఆకస్మికంగా శానిటేషన్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళికలో భాగంగా నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అందించేలా వాలంటీర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లు కూడా తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమగ్ర శానిటేషన్ నిర్వహణ కోసం జవాన్లకు లాగ్బుక్లు అందజేసినట్లు తెలిపారు. జవాన్లు ప్రతిరోజూ తమ పరిధిలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాలను లాగ్బుక్లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే తమ పరిధిలో ఉన్న దుకాణాల నుంచి ట్రేడ్ లైసెన్స్ వసూళ్లను కూడా చేపట్టాలని సూచించారు.
ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో ప్రతి గడపకు వెళ్లి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించే విధానంపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని తెలిపారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిరోజూ సూచించిన కార్యక్రమాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం స్థానికంగా ఉన్న డీఆర్సీసీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. హసన్పర్తి మార్కెట్ ప్రాంతంలో కొందరు రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్నట్లు గమనించిన కలెక్టర్, వారిని మార్కెట్లోనే అమ్మకాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, సిఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, సానిటరీ సూపర్వైజర్ నరేందర్, సానిటరీ ఇన్స్పెక్టర్ భాషా నాయక్, ఆస్కి ప్రతినిధి రాజ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

