కలం, యాదగిరిగుట్ట : విద్యార్థినులకు నాణ్యమైన విద్యే లక్ష్యంగా మెరుగైన వసతులు అందేలా చూడాలని అధికారులను అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశించారు. శనివారం మోత్కూర్లోని కేజీబీవీ (Mothkur KGBV) రెసిడెన్షియల్ బాలికల కళాశాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు కల్పిస్తున్న మౌలిక వసతులు విద్యాబోధన తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ ను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు.
కళాశాలలోని స్టోర్ రూమ్ను విద్యార్థినులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన, భోజన నాణ్యత వసతులపై ఆరా తీశారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి విద్యాబోధన, భోజనం, వసతులు, ఇతర సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకొని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని విద్యార్థినులకు సూచించారు. అనంతరం మోత్కూర్ పట్టణంలో తాగునీటి సరఫరా పరిస్థితి పై ఎంపిడిఓ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మోత్కూర్ పెద్ద చెరువు కట్ట మరమ్మతుల కారణంగా మిషన్ భగీరథ నీరు రాకపోవడం పై ఆరా తీశారు. గ్రిడ్ పైప్ లైన్ స్వల్పంగా దెబ్బతిన్న నేపథ్యంలో పైప్లైన్కు మరమ్మతులు పూర్తి చేయించడంతో ప్రస్తుతం నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. తాగునీటి సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని సూచించారు.

