కలం, వెబ్ డెస్క్: బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్ (RCB vs GT)లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ చితకొట్టాడు. 58 బంతుల్లో సెంచరీ చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన వాళ్లు కూడా అదే ఊపును కొనసాగించారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి గుజరాత్ టైటాన్స్ 205 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టైటాన్స్కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ (32) ఆచితూచి ఆడుతూ సుదర్శన్కు మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 12.4 ఓవర్లలోనే 128 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు. గిల్ అవుటైన తర్వాత వచ్చిన జోస్ బట్లర్ (25) కాసేపు అలరించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా సాయి సుదర్శన్ మాత్రం అస్సలు తగ్గలేదు. కేవలం 58 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో నూరో మార్కును అందుకున్నాడు. 172 స్ట్రైక్ రేట్తో సాగిన ఇతడి ఇన్నింగ్స్ స్టేడియంను హోరెత్తించింది. అయితే సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే హేజిల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. చివర్లో జేసన్ హోల్డర్ కేవలం 10 బంతుల్లోనే 23 పరుగులు చేసి స్కోరును 200 దాటించాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్, సుయాష్ శర్మ తలో వికెట్ తీసినప్పటికీ పరుగులు నియంత్రించడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా 4 ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకోగా, రొమారియో షెపర్డ్ వేసిన ఏకైక ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం ఆర్సీబీ ముందు 206 పరుగుల లక్ష్యం ఉంది. మరి దానిని ఛేదించడంలో ఆర్సీబీ ఓపెనర్లు ఎంతమాత్రం సక్సెస్ అవుతారో చూడాలి.

