కలం, వెబ్ డెస్క్: మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం ఫిబ్రవరి 24తో ముగిసింది. దీంతో ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో 2028 ఫిబ్రవరి చివరి వరకు ఆయన మీడియా అకాడమీ (Telangana Media Academy) చైర్మన్గా కొనసాగనున్నారు. పదవీ కాలం ముగిసిన మరుసటి రోజున ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. సాధారణంగా పదవీకాలం ముగియడానికి కొన్ని గంటల ముందే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం ఆనవాయితీ కానీ ఇప్పుడు మాత్రం మరుసటి రోజున ఉత్తర్వులు రెడీ అయ్యాయి. ప్రస్తుతం జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరుగుతున్న సమయంలో మీడియా అకాడమీ యాక్టివ్ రోల్ పోషించాల్సి ఉంటుంది. చైర్మన్ లేకపోతే అకాడమీ పాత్ర అధికారులకే పరిమితం కానున్నది. దీంతో చైర్మన్ నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
గత ప్రభుత్వం జారీ చేసిన అక్రెడిటేషన్ కార్డులే ఇప్పటికీ ‘ఎక్స్ టెన్షన్’ పేరుతో కొనసాగుతున్నాయి. ఈ నెల చివరికే కొత్తవి వస్తాయని భావించినా మార్చి 31 వరకు ఈ కార్డుల గడువు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల విభాగం ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది. మరోసారి పొడిగించాల్సిన అవసరం లేకుండా అప్పటికల్లా కొత్త కార్డులు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పుడు చైర్మన్ పదవీకాలాన్ని పొడిగించడంతో కొత్త కార్డుల జారీ ప్రక్రియ షెడ్యూలు ప్రకారం కొనసాగనున్నది. అక్రెడిటేషన్ కార్డుల జారీకి ఇప్పటికే విడుదల చేసిన జీవోలోని నిబంధనలు విమర్శలకు దారితీయడం, నిత్య నిరసనలతో వివాదాస్పదం కావడంతో వాటిని సవరించే అవకాశాలున్నట్లు జర్నలిస్టుల్లో చర్చ మొదలైంది. చైర్మన్గా శ్రీనివాసరెడ్డి (Srinivas Reddy) నియామకం (ఎక్స్ టెన్షన్)తో ఎలాంటి మార్పులు జరుగుతాయన్నది ఆసక్తికరం.
Read Also: బ్యాటర్లు ఫెయిల్ అవ్వడం వల్లే ఓడిపోయాం: అఫ్రిది
Follow Us On: Instagram

