కలం, నిజామాబాద్ బ్యూరో : వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు మేలైన పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) రైతులకు సూచించారు. ఖరీఫ్ సీజన్ ను పురస్కరించుకుని సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సరిపడా ఎరువులు, విత్తనాల పంపిణీపై చర్చించి, అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసినందున, తక్కువ నీటి వినియోగం అవసరం అయ్యే స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని రైతులను కోరారు. కేవలం వరి పంటకే పరిమితం కాకుండా జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి పంటలను సాగు చేయాలన్నారు. అధిక దిగుబడిని అందించే నాణ్యమైన విత్తనాలను వినియోగించాలని, మేల్ సీడ్ ను వాడవద్దని సూచించారు. ఖరీఫ్ లో జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
లారీలు, హమాలీల కొరత, ఎండ తీవ్రత వంటి అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, వాటిని అదిగమిస్తూ రబీలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. దిగుబడులు ఆలస్యంగా వచ్చిన బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలను మినహాయిస్తే, జిల్లాలో ధాన్యం సేకరణ పూర్తయ్యిందని అన్నారు. బాల్కొండ సెగ్మెంట్ లో ఒకటి రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయని సుదర్శన్ రెడ్డి తెలిపారు.

