కలం, నల్లగొండ: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీల ప్రక్రియ నిలిచిపోవడంపై ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెంట్రల్ అసోసియేషన్ పిలుపు మేరకు నల్గొండ (Nalgonda) జిల్లాలో వైద్యులు నల్ల బ్యాడ్జీలు (Doctors Protest) ధరించి నిరసన కార్యక్రమానికి దిగారు. జీవో నెం.38 ప్రకారం బదిలీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియ నిలిచిపోయిందని వైద్య సంఘం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ వైద్యుల హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని వారు పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులలోని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ల పోరాటానికి నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్, టీఎన్జీవో సభ్యులు కూడా పూర్తి మద్దతు ప్రకటించారు. వారంతా ఈ నిరసనల్లో ప్రత్యక్షంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మరోవైపు ప్రభుత్వ వైద్యుల రిటైర్మెంట్ వయస్సును పెంచాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైద్యుల సంఘం గట్టిగా డిమాండ్ చేసింది. “అధికారుల ఉదాసీనత వల్లే వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్తాం. జీవో 38 ప్రకారం బదిలీలు చేపట్టే వరకు మా పోరాటం ఆగదు” అని ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు తెలిపారు. వైద్యుల ఈ ఆకస్మిక నిరసనతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.. బదిలీల ప్రక్రియపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

