కలం, స్పోర్ట్స్ : యూ-18 మెన్స్ ఆసియా కప్ హాకీ (Asia Cup Hockey) లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్లో సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్థాన్ను 5-3 తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరగబోయే టైటిల్ పోరులో ఆతిథ్య జపాన్తో భారత్ తలపడనుంది. మ్యాచ్ ప్రారంభంలో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 12వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్ను భారత ఫార్వర్డ్ ఆటగాడు ఆశిష్ తాని పుర్తి గోల్గా మార్చి భారత్కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
రెండో క్వార్టర్లో పాకిస్థాన్ దూకుడు పెంచింది. 16వ నిమిషంలో పాక్ కొట్టిన బలమైన డ్రాగ్ఫ్లిక్ను భారత కీపర్ ఆయుష్ రజాక్, డిఫెండర్ అంశ్ బహుత్రా అడ్డుకున్నారు. కానీ, 27వ నిమిషంలో పాక్ ఆటగాడు అదీల్ ఫీల్డ్ గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది. మూడో క్వార్టర్లో ఆట మరింత వేడెక్కింది. 35వ నిమిషంలో షారూఖ్ అలీ గోల్ చేసి భారత్ను ముందంజలో నిలిపాడు. అయితే, 37వ నిమిషంలో ముహమ్మద్ ఫర్హాన్ అస్లాం ఫీల్డ్ గోల్తో, 42వ నిమిషంలో ఉజైర్ అహ్మద్ ఖురేషి పెనాల్టీ కార్నర్ గోల్తో పాకిస్థాన్ 3-2 ఆధిక్యంలోకి వెళ్ళింది.
చివరి క్వార్టర్లో భారత్ అద్భుతంగా పుంజుకుంది. 46వ నిమిషంలో పాక్ ఆటగాడు ముజమ్మిల్ సయీద్ గ్రీన్ కార్డ్ తిన్నాడు. దీనిని అనుకూలంగా మార్చుకున్న ఆశిష్ తాని పుర్తి 49వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను గోల్గా మార్చి స్కోరును 3-3తో సమం చేశాడు. ఆ తర్వాత 53వ నిమిషంలో ఆశిష్ మరో గోల్తో హాట్రిక్ పూర్తి చేసి భారత్కు 4-3 ఆధిక్యాన్ని ఇచ్చాడు. 56వ నిమిషంలో ఆశిష్ తన నాల్గో గోల్ కొట్టడంతో భారత్ 5-3తో విజయాన్ని ఖాయం చేసుకుంది.

