కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి (SSC) ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. కొంతమంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై ఫలితాల కంటే ముందే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు (Garikipati Narasimha Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులను వేధించడం సరికాదన్నారు. ఫలితాల పేరుతో పిల్లలను తిట్టొద్దని గరికిపాటి సూచనలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఫలితాల వల్ల అప్పటికే తీవ్ర ఆవేదనలో ఉన్న పిల్లలను నిందించడం వల్ల వారి మానసిక స్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. ఇతరుల మార్కులతో తల్లిదండ్రులు తమ పిల్లలను పోల్చి చూడొద్దన్నారు. ‘అప్పులు చేసి చదివించాం’ లాంటి మాటలతో పిల్లలపై ఒత్తిడి పెంచవద్దన్నారు. మార్కుల కంటే వారి మానసిక ధైర్యం, ప్రాణాలే ముఖ్యమని ఆయన హితవు పలికారు.

