కలం, వెబ్డెస్క్: మెదక్ (Medak) జిల్లాలో పాపన్నపేట మండల పరిధిలోని పొడ్చన్నల్లి తండాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి పరీక్షల ఫలితాల (SSC Exam results) నేపథ్యంలో ఫెయిల్ అవుతానన్న భయంతో తండాకు చెందిన సాయిప్రియ అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పరీక్షలు రాసినప్పటి నుంచి సాయిప్రియ ఫెయిల్ అవుతానన్న భయంతో గడుపుతోంది. ఫలితాలు రాకముందే తీవ్ర ఆందోళనకు గురైంది. ఇలా భయంతో ఉన్న సాయిప్రియకు తల్లి ధైర్యం చెప్తూనే ఉంది. పరీక్షల్లో ఫెయిల్ అయినా పర్వాలేదని, ఫలితాల గురించి భయపడొద్దని కూతురికి ధైర్యం చెప్పింది. అయినా సాయిప్రియ మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంది. అయితే నిన్న విడుదలైన ఫలితాల్లో సాయి ప్రియ 480 మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. పరీక్షల ఫలితాలు చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పరీక్షల్లో పాస్ అయిన సంతోషాన్ని చూడకుండా తమ కూతురు భయంతో ఆత్మహత్య చేసుకుందని రోదిస్తున్నారు. సాయిప్రియ ఆత్మహత్య ఘటనతో తండాలో తీవ్ర విషాదం నెలకొంది.

