కలం, స్పోర్ట్స్: వేపింగ్ చేసిన వివాదంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్పై (Riyan Parag) బీసీసీఐ (BCCI) యాక్షన్ తీసుకుంది. క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘించినందుకు పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తూ బోర్డు గురువారం నిర్ణయం వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో కెమెరా కళ్లు డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లాయి. ఆ సమయంలో పరాగ్ వేపింగ్ చేస్తున్న దృశ్యాలు టీవీల్లో స్పష్టంగా కనిపించాయి. దేశంలో ఈ-సిగరెట్ల వాడకం, అమ్మకాలపై కఠిన నిషేధం ఉండటంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. పరాగ్ చేసిన ఈ పని ఆట గౌరవాన్ని తగ్గించేలా ఉందని సర్వత్రా విమర్శలు వచ్చాయి.
నిజానికి డ్రెస్సింగ్ రూమ్లో ధూమపానంపై ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో నేరుగా ఎటువంటి నిబంధన లేదు. దీంతో బోర్డు కాస్త సందిగ్ధంలో పడింది. చివరకు క్రికెట్ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రవర్తనను అరికట్టే ఆర్టికల్ 2.21 కింద అతడిని దోషిగా తేల్చారు. పరాగ్ చేసిన తప్పును ‘లెవల్ 1’ నేరంగా పరిగణించిన బోర్డు, కేవలం జరిమానాతో సరిపెట్టింది. కొంతమంది అభిమానులు నిషేధం విధించాలని కోరినప్పటికీ, నిబంధనల మేరకు ఫీజులో కోత మాత్రమే విధించారు.
గురువారం ఉదయమే పరాగ్కు ఈ నోటీసులు అందాయి. బోర్డు తీసుకున్న నిర్ణయంపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, పరాగ్ (Riyan Parag) ఆ పని చేసేలా లేడు. అనవసర వివాదాలు పెంచుకోవడం ఇష్టం లేక, జరిమానా చెల్లించి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని అతడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్రీడాకారులు మైదానంలోనే కాకుండా డ్రెస్సింగ్ రూమ్లో కూడా బాధ్యతగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
Read Also: టోఫు తింటేనే ఆడవారిని గౌరవించినట్లా..? నెట్టింగ్ మరో వింత థీరీ..
Follow Us On: Instagram

