కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చికిత్స వికటించి ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. గాంధీ మెడికల్ కాలేజీలో బీఎస్సీ ఓటీటీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పల్లవి గౌడ్ ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతూ అదే ఆసుపత్రిలో చేరింది. పరిస్థితిని సమీక్షించిన వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు.
మొదటి సర్జరీ విఫలం కావడంతో వైద్యులు రెండోసారి కూడా సర్జరీ చేయాల్సి వచ్చింది. రెండోసారి ఆపరేషన్ చేసినప్పటికీ బ్లీడింగ్ అదుపులోకి రాలేదు. చివరకు పరిస్థితి విషమించి పల్లవి కన్నుమూసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని పల్లవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యం తమకు మృతదేహాన్ని అప్పగించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

