కలం, వెబ్ డెస్క్: తెలంగాణ (Pawan Kalyan) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై గద్దర్ (Gaddar) కుమార్తె వెన్నెల (Vennela) స్పందించారు. తెలంగాణపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ఆడబిడ్డగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తెలంగాణ సినిమాల్లో నటిస్తే, పొత్తులు పెట్టుకుంటే, పైసలు పంచితే, లాబీలు చేస్తే రాలేదని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం అని, ఆత్మ గౌరవ పోరాటం అని స్పష్టం చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, హింసించకుండా, తమను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంతచారి దీనికి సాక్ష్యమన్నారు. తెలంగాణ పోరాటం ఒక సాంస్కృతిక యుద్ధం అని, పాటలతో, మాటలతో గడప గడపకు వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసిన పోరాట గాథలున్న చరిత్ర ఈ గడ్డ అని చెప్పారు.
మా భూములు మావి, మా నీళ్లు మావి, మా పాలన మాది అనే ఒక నినాదంతో పల్లె పల్లె, గడప గడప పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ (Telangana) అన్నారు. తెలంగాణ పోరాటం 2 వేలకు పైగా అమరులయ్యారని, అది కేవలం ఆన్ రికార్డ్ మాత్రమేనని, ఇంకా ఎంతో మంది అన్నలు అడవుల్లో ఎన్ కౌంటర్ అయ్యారని వెన్నెల తెలిపారు. మలిదశ పోరాట ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరులయ్యారన్నారు. ఎంతో మంది ఆడబిడ్డలు, తల్లులు తమ కొడుకుల్ని, బిడ్డలను తెలంగాణ కోసం పోరాడండని పంపించి కుటుంబాలను చూసుకున్న చరిత్ర మాదేనన్నారు. ఇక తెలంగాణ మీ అయ్య జాగీరా? అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వెన్నెల స్పందించారు. “పవన్ కల్యాణ్ అన్నట్లు తెలంగాణ మా అయ్యల జాగీరే, ఇప్పుడు మా జాగీర్, రేపు మా భావి తరాల జాగీర్.. ఇది మా గడ్డనే” అని వెన్నెల తీవ్ర స్థాయిలో స్పందించారు.

