Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం: శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాజీ హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీతో (Mohammed Mahmood Ali) కలిసి మాట్లాడారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎన్నికల ముందు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయించే దిశగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలంటే పార్టీ బలోపేతం అవసరమని, అందుకే సభ్యత్వ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి వివరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకునేలా బీఆర్ఎస్ ఒత్తిడి పెంచిందని, అందుకే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు.

మాజీ హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేదని, ఇప్పుడు లాఠీల పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్‌లు వాల్యా నాయక్, వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూబ్‌నగర్ మండలం అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, హన్వాడ మండలం అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు రెహమాన్, ఆంజనేయులు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>