కలం, వెబ్ డెస్క్: ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి (G Chinna Reddy) కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. కమిటీ ఛైర్మన్ డాక్టర్ మల్లు రవికి వివరణ ఇచ్చారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు. ‘గత రెండున్నరేళ్లుగా ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో గత 40 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆవేదననే వ్యక్తం చేశాను తప్ప, ఎవరిపై అనుచితంగా మాట్లాడలేదు. అలాంటి అలవాటు, అవసరం నాకు లేదు. నాకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.
వాళ్లు నాకు దేవుళ్లతో సమానం..
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా ఉన్న తాను 1978లో ఇందిరా గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చిన్నారెడ్డి వివరించారు. ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాలు తనకు ఆలయాలతో సమానం అన్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తనకు దేవుళ్ల వంటి వారని పేర్కొన్నారు. అలాంటి వారికి వ్యతిరేకంగా తాను మాట్లాడే పరిస్థితి రాదని చిన్నారెడ్డి స్పష్టం చేశారు.

