కలం, నిర్మల్: భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్మల్ డిపో (TGSRTC Nirmal Depot) ఆధ్వర్యంలో ఆదివారం రామేశ్వరం (Rameshwaram) పుణ్యక్షేత్రానికి ప్రత్యేక యాత్రా బస్సును ప్రారంభించినట్లు డిపో మేనేజర్ కె.పండరి తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు నిర్మల్ నుంచి బయలుదేరి కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, పాతాళ శెంబు, మధురై మీదుగా రామేశ్వరం చేరుకుంటుందని చెప్పారు. తిరుగు ప్రయాణంలో కంచీపురం, శ్రీకాళహస్తి మీదుగా నిర్మల్కు చేరుకుంటుందని వివరించారు.
భక్తుల నుంచి యాత్రా బస్సులకు విశేష స్పందన లభిస్తోందని, ప్రయాణికుల ఆదరణతో వరుసగా ప్రత్యేక పుణ్యక్షేత్ర యాత్రలను నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ప్రయాణికుల కోరిక మేరకు సోమనాథ్, ద్వారక వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నిర్మల్ డిపో ఆధ్వర్యంలో కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, పూరి జగన్నాథ్, కోణార్క్, అన్నవరం, అరసవెల్లి, సింహాచలం, విశాఖపట్నం, ద్వారక తిరుమల, భద్రాచలం, పండరిపూర్, తుల్జాపూర్, కొల్హాపూర్, గోవా తదితర ప్రాంతాలకు విజయవంతంగా ప్రత్యేక యాత్రా బస్సులు నిర్వహించినట్లు తెలిపారు.

