కలం, వెబ్ డెస్క్ : విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై నేడు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నది. దుర్గమ్మ సన్నిధిలో మొత్తం 250 మంది చిన్నారులకు ఉచితంగా అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ విశేష కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా ముందస్తుగా పేర్ల నమోదు ప్రక్రియను చేపట్టారు.
ఇంద్రకీలాద్రిపై ఉన్న మహా మండపం ఆరవ అంతస్తులో ఈ విద్యాభ్యాస వేడుకను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల శుభ ముహూర్తానికి అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులతో అక్షరాలు దిద్దిస్తారు. రద్దీని నియంత్రించేందుకు, కార్యక్రమం ప్రశాంతంగా సాగేందుకు వీలుగా చిన్నారులతో పాటు కేవలం వారి తల్లిదండ్రులకు మాత్రమే లోపలికి అనుమతి కల్పించారు. ఆలయ అధికారులు అక్షరాభ్యాసం చేసుకునే ప్రతి చిన్నారికి పలక, బలపంతో పాటు పూజకు అవసరమైన సామగ్రిని ఉచితంగా అందజేస్తున్నారు. దుర్గమ్మ చెంత విద్యాబుద్ధులు ప్రారంభం కావడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

