కలం, వరంగల్ బ్యూరో: కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు ఎంతో మేలు చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) అన్నారు. మంగళవారం హనుమకొండ (Hanumakonda) హంటర్ రోడ్డులోని రైతు సంగ్రామ సదస్సు వేదిక వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. నాడు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ సమయంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను తీసుకు వచ్చి రైతులను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ సదస్సు రైతుల సమస్యలను ప్రజలకు తెలిపేందుకు ఏర్పాటు చేస్తే.. మేళా అంటే ఏంటి? ఎందుకు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రైతు సంగ్రామ సదస్సుకు కేటీఆర్ హాజరు అవుతున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండుగగా మారింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దండగగా మారిందన్నారు. రైతులకు మద్దతుగా సదస్సు పెడుతుంటే మా కార్యకర్తలు కట్టిన పార్టీ తోరణాలు, ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమెల్సీ, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం బీఆర్ఎస్ పోరాడిందన్నారు. కేసీఆర్ రైతులను రాజు చేయాలని చూశారని, రైతుల విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు విస్మరించిందన్నారు. మాజీ మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల గోసను ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైతు రుణ మాఫీకి రూ.36 వేల కోట్లు అవసరం అయితే రూ.18 వేల కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ రైతు బంధు వరి నాట్లకు ముందు ఇచ్చారని ఇప్పుడు అతీగతీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గుర్తు చేసేందుకే సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు విస్మరించిందన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. రైతు సంగ్రామ సదస్సు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతుల పంటలను కొనుగోలు చేయడం లేదన్నారు.
మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. రైతుల సదస్సును విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని నాయకులను అరెస్ట్ చేసి సదస్సును, కార్యక్రమాన్ని ఫెయిల్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా సదస్సు నిర్వహించి తీరుతామన్నారు.
Read Also: నేను రాజీనామా చేయను: మమతా బెనర్జీ సంచలన ప్రకటన
Follow Us On : WhatsApp

