కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో రెండు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) లను ఏర్పాటు చేసేందుకు రసాయనాల తయారీ సంస్థ బీఏఎస్ఎఫ్ (BASF) ముందుకొచ్చింది. గ్లోబల్ డిజిటల్ హబ్, గ్లోబల్ సర్వీసెస్ హబ్ల పేరుతో రెండు జీసీసీలను నెలకొల్పనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సదరు సంస్థ అంగీకార పత్రం సమర్పించింది. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, జర్మన్ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ ల సమక్షంలో బిఎఎస్ఎఫ్ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు టోబియాస్ డ్రాట్, రాష్ట్ర లైఫ్సైన్సెస్ సీఈఓ సర్వేశ్ సింగ్ కు అంగీకార పత్రాన్ని (Letter of Intent-LOI) అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) మాట్లాడుతూ.. ఏడాదికి 100 జీసీసీల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. వీటి ద్వారా లక్ష మంది ఐటి నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు.
హైదరాబాద్ కేవలం కార్యాలయాల కేంద్రంగా మాత్రమే కాకుండా ఆవిష్కరణలు, ఇంజనీరింగ్ రంగాల్లో ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. ఇందులో భాగంగా కృత్రిమ మేథస్సు ఆధారిత కేంద్రం ఐకామ్ (AIKAM), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, 200 ఎకరాల్లో ఏఐ సిటీ, క్వాంటమ్ హబ్, జీవ విజ్ణాన పరిశోధన్ సంస్థ ‘1 బయోల్యాబ్’ లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 160 ఏళ్ళ చరిత్ర కలిగిన బిఎఎస్ఎఫ్ (BASF) ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు.
234 ఇండస్ట్రీస్, 1,08,000 మంది ఉద్యోగులతో పనిచేస్తున్న ఈ సంస్థ వార్షిక ఆదాయం దాదాపు రూ.5 లక్షల కోట్లు (60 బిలియన్ డాలర్లు) అని తెలిపారు. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్, వాన్గార్డ్, ఎలీ లిల్లీ, మారియట్ ఇంటర్నేషనల్ లాంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ జీసీసీలు ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయని అన్నారు.
Read Also: నేను రాజీనామా చేయను: మమతా బెనర్జీ సంచలన ప్రకటన
Follow Us On : WhatsApp

